చెన్నై, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కన్నుమూసిన చెన్నై అడయార్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ వి.శాంతకు దేశంలోనే అత్యున్నత పౌరపురస్కారమైన 'భారతరత్న' ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెల 26న జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈమేరకు ప్రకటించనున్నట్లు అధికారవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే భారతరత్న పురస్కారం పొందిన వారిలో తమిళనాడుకు చెందిన రాజాజీ, సీవీరామన్, కామరాజర్, ఎంజీ రామచంద్రన్, ఎంఎస్ సుబ్బులక్ష్మి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కేన్సర్ రోగులకు అహరహరం సేవలందించేందుకు తన జీవితాన్ని అంకింత చేసిన డాక్టర్ శాంతకు కూడా భారతరత్న ప్రకటించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.

