నోయిడా: ఈ-కామర్స్ మార్కెట్ అభివృద్ధి ఇంటి నుంచి కదలకుండానే తమకు కావాల్సిన అన్ని వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఫుడ్ ఆర్డర్ గురించి చెప్పుకోవాలి. ఈ-మార్కెట్లో ఫుడ్ డెలివరీ పాత్ర ఎక్కువే. అయితే ఒక్కోసారి అడ్రస్ తప్పుగా ఇచ్చారనో, ఆర్డర్ ఆలస్యమవుతుందనో ఆర్టర్లు కాన్సిల్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి డెలివరీ అయ్యాక కూడా ఆర్డర్ చేసిందానికి బదులు మరొకటి వచ్చిందనో లేదంటే నాణ్యత లేదనో కూడా రద్దు చేస్తుంటారు. కానీ దొంగతనం కారణంగా ఒక ఫుడ్ ఆర్డర్ క్యాన్సలైందంటే ఆశ్చర్యం కలుగుతుంది. దేశ రాజధాని సమీపంలోని నోయిడాలో జరిగిందీ సంఘటన. కాగా, నెటిజెన్లు దీనిపై జోకులు వేస్తూ తెగ నవ్వుకుంటున్నారు.
ఇక విషయంలోకి వెళ్తే.. నోయిడాకు చెందిన ఛయనిక దాస్ అనే వ్యక్తి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ కన్ఫిర్మ్ అయిన కొద్ది సేపటికి ఆమె మొబైల్కు మరొక మెసేజ్ వచ్చింది. ''మీ ఆర్డర్ను మీకు చేరవేయలేకపోతున్నందుకు క్షమించాలి. ఎందుకంటే మీరు ఆర్డర్ చేసింది ఎవరో తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఇది మీకు కలతగా ఉంటుందని తెలుసు. నేను మీకోసం ఈ ఆర్డర్ను రద్దు చేస్తాను. మరేదైనా రెస్టారెంట్ నుంచి అయినా కొత్త ఆర్డర్ ఇవ్వగలరని కోరుతున్నాను'' అని ఆ మెసేజ్లో సారాంశం. మెసేజ్ చూసుకున్న ఛయనిక ఒక్క సారిగా షాకయ్యారు. అనంతరం ఈ మెసేజ్ని స్క్రీన్షాట్ తీసి తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేస్తూ ''ఎవరో దొంగిలించారట. నోయిడాలో ఇలాంటివి కూడా జరుగుతాయా?'' అని ట్వీట్ చేశారు. అనంతరం తనకు స్విగ్గీ నుంచి కాల్ వచ్చిందని, అందులో ''మేడమ్ మీ ఆర్డర్ దొంగిలించారు. రైడర్ను బాగా కొట్టారు'' అని మరో ట్వీట్లో ఛయనిక చెప్పుకొచ్చారు.

