ఢిల్లీ, జులై 30 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. పంజాబ్లో జరుగుతున్న పేపర్ లీక్ ఘటనలను నిరసిస్తూ కమలం పార్టీ నేతలు ఆప్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేపర్ లీక్ ఘటనలకు బాధ్యత వహిస్తూ పంజాబ్ మంత్రి హర్జోత్ సింగ్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇటీవల పంజాబ్లో పలు రిక్రూట్మెంట్ పరీక్షలు, బోర్డు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తుతో ఆప్ ప్రభుత్వం ఆటలాడుతోందని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనల వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టాలని పట్టుబట్టారు. ముఖ్యంగా సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ నేతలు కోరారు.
ఆప్ కార్యాలయం వద్ద బీజేపీ నేతల నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఆందోళనకారులు ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వరుసగా పేపర్ లీక్ ఘటనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడారు. పేపర్ లీక్ల వల్ల వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహించారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, ఈ నిరసనల నేపథ్యంలో ఆప్ కార్యాలయం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
వార్తలు కూడా చదవండి...

