న్యూఢిల్లీ: ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండటంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రాన్ని నిలదీశారు. ద్రవ్యోల్బణాన్ని కూడా ఖాతరు చేయకుండా పన్నుల వసూళ్లలో ప్రభుత్వం బిజీగా ఉందని ఆరోపించారు. జీడీపీలో అద్భుతమైన వృద్ధి సాధించారంటూ మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'జీడీపీ (గ్యాస్-డీజిల్-పెట్రోల్ ధరలు) విషయంలో మోదీ అద్భుతమైన ప్రగతిని సాధించారు. జనం ద్రవ్యోల్బణం గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం పన్నుల వసూళ్లలో తలమునకలవుతోంది' అని రాహుల్ ఆదివారంనాడు ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా, కోవిడ్-19 మహమ్మారి కారణంగా చమురు ఉత్పత్తి దేశాల్లో ఉత్పత్తి తగ్గిపోవడమే ఇంధనం ధరల పెరుగుదలకు కారణమని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ చెబుతోంది.

