అనకాపల్లి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నిర్మూలన విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) స్పష్టం చేశారు.
యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ పరిధిలోని రాంకీ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో 20,876 కేజీల గంజాయి, 23 కేజీల హాష్ ఆయిల్ను పోలీసులు శాస్త్రీయ పద్ధతుల ద్వారా దహనం చేశారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడారు.
గంజాయి సాగుకు చెక్ పెట్టాం..
సీఎం చంద్రబాబు ఆదేశాలతో 'ఈగల్' వ్యవస్థని ఏర్పాటు చేశామని హోం మంత్రి అనిత తెలిపారు. గంజాయి సాగు, రవాణాని అరికట్టేందుకు ప్రత్యేకంగా 'ఈగల్' వ్యవస్థ పనిచేస్తోందని వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగుకు చెక్ పెట్టామని అన్నారు. గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తూ గంజాయి సాగును అరికట్టామని చెప్పుకొచ్చారు. 18 నెలల్లో ఐదుసార్లు గంజాయిని ధ్వంసం చేశామని తెలిపారు. యువతను డ్రగ్స్ బారి నుంచి రక్షించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని వివరించారు. ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ఈగల్ టీమ్స్తో పాటు, ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు.
యువత మత్తుకు దూరంగా ఉండాలి..
గంజాయి ముఠాలని సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని హోం మంత్రి అనిత తెలిపారు. డ్రగ్స్ కేసుల విషయంలో వేగవంతంగా విచారణ చేస్తున్నామని చెప్పారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. గంజాయిపై ఏపీలో యుద్ధం ప్రకటించామని.. 'చైతన్యం', 'సంకల్పం' పేరుతో డ్రగ్స్ రహిత సమాజం కోసం పోలీస్ యంత్రాంగం అద్భుతంగా కృషి చేస్తోందని హోం మంత్రి అనిత కొనియాడారు.
.
సాయికృష్ణ ఘటనపై సీఐ నాగరాజు సస్పెండ్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు
అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని
Read Latest AP News And Telangana News And National News
And Telugu News

