Dailyhunt
ఎల్జేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా పశుపతినాథ్

ఎల్జేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా పశుపతినాథ్

పాట్నా : లోక్‌జనశక్తి పార్టీ లోక్‌సభ నేతగా పశుపతి కుమార్ పారస్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం హాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐదుగురు పార్లమెంట్ సభ్యులం స్పీకర్ ఓం బిర్లాకు లేఖను సమర్పించామని, స్పీకర్ సమయం ఇవ్వగానే కలుస్తామని ఆయన తెలిపారు. అయితే లోక్‌సభలో నేతగా చిరాగ్ నేతృత్వంపై తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు అసంతృప్తితో ఉన్నారని, ఆయన ఉండటం వారికి ఏమాత్రం గిట్టడం లేదని పశుపతినాథ్ అన్నారు. ''మా పార్టీలో ఆరుగురు ఎంపీలున్నారు. మా పార్టీని కాపాడుకోవాలని ఐదుగురు ఎంపీలు కాంక్షిస్తున్నారు. దీంతో నేను పార్టీని చీల్చానన్న వాదనలో పసలేదు. పైగా నేను పార్టీని రక్షించాను.

చిరాగ్ పాశ్వాన్ మాకు అధ్యక్షుడు. ఆయనపై మాకు ఎలాంటి వ్యతిరేకతా లేదు'' అని పశుపతినాథ్ ప్రకటించారు.

లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధినేత చిరాగ్ పాశ్వాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభలోని ఆరుగురు ఎల్‌జేపీ ఎంపీల్లో ఐదుగురు చిరాగ్ పాశ్వాన్ పై తిరుగుబాటు చేశారు. లోక్ సభలో తమను ఎల్‌జేపీ పార్టీ నుంచి వేరుగా గుర్తించాలని తాజాగా కోరారు. తిరుగుబాటు ఎంపీలకు చిరాగ్ పాశ్వాన్ మామ అయిన పశుపతి కుమార్ పరాస్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ రాజ్, చందన్ సింగ్, వీణాదేవి, మెహబూబ్ అలీ కేషర్ లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి చిరాగ్ పాశ్వాన్ తో ఆ పార్టీ ఎంపీలకు విబేధాలు ఏర్పడ్డాయి. ఐదుగురు ఎంపీలు తమకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. తిరుగుబాటు ఎంపీలు అధికార జేడీ(యూ)లో చేరే అవకాశం ఉందని రాజకీయవర్గాలు తెలిపాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy