ఏలూరు జిల్లా, జులై 7 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కారుమూరి దుర్గారెడ్డి అనే వ్యక్తిని కత్తితో నరికి చంపేశారు.
పెరంపేటలోని రైతుభరోసా కేంద్రం దగ్గర కారుమూరి దుర్గారెడ్డిపై అతని అన్నయ్య కొడుకు కారుమూరి శ్రీనివాస్ రెడ్డి, అతని అనుచరులు దాడి చేశారు. ఆస్తి, పొలం వివాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే జంగారెడ్డిగూడెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ హత్యకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. అయితే నిందితులను వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, గ్రామస్తులు నిరసనకు దిగారు.
న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించనివ్వబోమని కుటుంబ సభ్యులు స్పష్టం చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను పెంచారు. అయితే పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మృతుడి శరీరంపై ఉన్న గాయాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తు అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
.
పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి: సీఎం చంద్రబాబు
ఐదేళ్లలో 20 వేల స్టార్టప్లు, లక్ష ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News

