అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులకు జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి
నంద్యాల (కల్చరల్), మే 11: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరగడానికి పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కె.శ్రీనివాసులు కోరారు.
శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు చివరి 48 గంటల ప్రొటోకాల్పై ఎస్పీ రఘువీర్రెడ్డితో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ మెటీరియల్ పోలింగ్ కేంద్రాలకు చేరవేయడం... పోలింగ్ తర్వాత తిరిగి ఆర్జీఎం, శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో వాటిని భద్రపరచడం మొదలైన అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశామన్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు వెలుపలే ఏజంట్లు కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
పోలింగ్కు ముందు 48 గంటల నుంచి ఎన్నికల ముగిసే వరకు కీలకమైన సమయమని, పోలింగ్ ఏర్పాట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై ఎఫ్ఎస్టీ, వీఎస్ట్ బృందాలు నియంత్రణ చర్యలు తీసుకోవాలని అదేశించారు పోటీ చేసే అభ్యర్థులకు ఒక వాహనం, ఎలెక్షన్ ఏజంట్లకు ఒక వాహనం, అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక వాహనం చొప్పున అనుమతిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రఘువీర్ రెడ్డి, రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు.

