Dailyhunt

ఏపీ @ 7,00,235

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఏడు లక్షలకు చేరుకున్నాయి. మహారాష్ట్ర తర్వాత ఏడు లక్షల మార్కు దాటిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71 వేల శాంపిల్స్‌ను పరీక్షించగా 6,751 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,00,235కి చేరాయి. ఒకటి నుంచి లక్ష కేసులు నమోదు కావడానికి 137 రోజుల సమయం పట్టగా.. ఆ తర్వాత నుంచి ప్రతి లక్ష కేసులు చాలా తక్కువ వ్యవధిలోనే నమోదయ్యాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కేవలం పది లేదా పదకొండు రోజుల వ్యవధిలో లక్ష కేసులు నమోదైన పరిస్థితి కూడా ఉంది.

ఆరు నుంచి ఏడు లక్షల కేసులు నమోదు కావడానికి 15 రోజుల సమయం పట్టింది. సెప్టెంబరు 17 నాటికి ఏపీలో 6 లక్షల కేసులున్నాయి. అక్టోబరు 1 నాటికి ఆ సంఖ్య ఏడు లక్షలకు చేరింది. ఇదే సమయంలో ఏపీలో 12.40 శాతం వరకు వెళ్లిన పాజిటివిటీ రేటు 11.91 శాతానికి తగ్గింది. తాజాగా తూర్పుగోదావరిలో 986 కేసులు నమోదవగా.. చిత్తూరులో 888, ప్రకాశంలో 783 మందికి వైరస్‌ సోకింది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 7,297 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రికవరీల సంఖ్య 6,36,508కి పెరిగింది. 57,858 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. గురువారం అన్ని జిల్లాల్లో కలిపి 41 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5869కి చేరింది.

ట్యూషన్‌కెళ్లిన విద్యార్థులకు కరోనా

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో ప్రైవేటు ట్యూషన్లకు వెళ్లిన 25 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు జిల్లా యంత్రాంగానికి నివేదికలు అందాయి. దీంతో ట్యూషన్‌ నిర్వాహకులపై కొవిడ్‌-19 చట్టం కింద చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌.. తహసీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్లు, విద్యా శాఖ అధికార్లను ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy