Dailyhunt
ఫైళ్లకే పరిమితమైన ప్రాజెక్టులను పట్టాలెక్కించాం: ప్రధాని మోదీ

ఫైళ్లకే పరిమితమైన ప్రాజెక్టులను పట్టాలెక్కించాం: ప్రధాని మోదీ

ఆంధ్రజ్యోతి, మార్చి 28: నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

2004 నుంచి 2014 మధ్య కాలంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కేవలం ఫైళ్లకే పరిమితమైందని, అభివృద్ధి పట్ల కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి లేమికి ఇది నిదర్శనమని ఆయన ఆరోపించారు.

ఒకప్పుడు కేవలం కాగితాల మీద మాత్రమే ఉన్న జేవార్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్.. నేడు క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం దాల్చుతోందని ప్రధాని అన్నారు. 2004లో ప్రతిపాదించినప్పటికీ.. పదేళ్ల పాటు కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ఎస్పీ ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంత అభివృద్ధిని గత పాలకులు అడ్డుకున్నారని ఆరోపించారు.

2014 తర్వాత దేశంలో, 2017 తర్వాత ఉత్తరప్రదేశ్‌లో వచ్చిన మార్పుల వల్ల ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ వేగవంతమయ్యాయని మోదీ చెప్పుకొచ్చారు. పర్యావరణ, భూసేకరణ వంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టులను పట్టాలెక్కించినట్లు తెలిపారు. జేవార్ ఎయిర్‌పోర్ట్ కేవలం విమానాశ్రయం మాత్రమే కాదని, ఇది ఈ ప్రాంతానికి 'లాజిస్టిక్స్ గేట్‌వే'గా మారుతుందని ఆయన అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి లభించడమే కాకుండా, పశ్చిమ యూపీ పారిశ్రామిక హబ్‌గా మారుతుందని స్పష్టం చేశారు.

'పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు?' అని ప్రధాని ప్రతిపక్షాలను మోదీ ప్రశ్నించారు. కేవలం ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం కాకుండా, పని చేసి చూపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఇలా ఉండగా, నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే.. ఇది ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటిగా నిలవనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy