- ఓపీఎస్, దినకరన్పై తేని సభలో ఎడప్పాడి ధ్వజం
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్సెల్వం, ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ ఊసరవెల్లిలా తరచూ రంగులు మారుస్తుంటారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (Former CM Edappadi Palaniswami) తీవ్రంగా విమర్శించారు.
తేని లోక్సభ నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి నారాయణస్వామికి మద్దతుగా తేనిలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పళనిస్వామి ప్రసంగించారు. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరిస్తున్న వారిలో సగం మంది అన్నాడీఎంకే నుంచి వెళ్లిన వారేనని, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తున్న వారు కూడా అన్నాడీఎంకేకు వెన్నుపోటు పొడిచిన వారేనని విమర్శించారు. స్వార్థం కోసం పార్టీ మారిన వారిలో ముఖ్యులైన ఓపీఎస్, దినకరన్ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు రాకపోవడంతో ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. డీఎంకే(DMK) కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్న ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఒక్క వేదికపై కూడా రైతుల గురించి ప్రస్తావించడం లేదన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో అన్నివర్గాల ప్రజల సంక్షేమార్థం ప్రవేశపెట్టిన పథకాలను డీఎంకే ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తూ వచ్చిన ల్యాప్టాప్ పథకాన్ని రద్దు చేసిందన్నారు. 38 మంది ఎంపీలున్నప్పటికీ రాష్ట్ర హక్కులపై ఒక్కరోజైనా పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించలేదన్నారు. డీఎంకే ప్రతిపక్షంగా వ్యవహరించిన సమయంలో గో బ్యాక్ మోదీ అని నినాదాలు చేసింయు ప్రస్తుతం ఆయన్ను ఆహ్వానిస్తోందన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, డీఎంకే కూటములను అధికమించి అన్నాడీఎంకే అధిక స్థానాల్లో గెలుస్తుందని ఈపీఎస్ చెప్పారు.

