అమరావతి, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Anita) .. పోలీసులకు దిశానిర్దేశం చేశారు.
ఏపీలోని పలు జిల్లాల ఎస్పీలతో హోం మంత్రి అనిత సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు (శనివారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై ఎస్పీలతో సుదీర్ఘంగా హోం మంత్రి చర్చించారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
వినాయక చవితి ఉత్సవాలకు అనుమతుల జారీపై ఎస్పీలతో హోం మంత్రి అనిత మాట్లాడారు. ఈ ఉత్సవాల అనుమతుల కోసం అమలు చేస్తున్న సింగిల్ విండో విధానంపై ఉత్సవ కమిటీలకు, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఏకదంతుడి మండపాలు, ఊరేగింపుల విషయంలో నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని హోం మంత్రి దిశానిర్దేశం చేశారు.
శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నిన్న జరిగిన శాంతిభద్రతల సమీక్షపై ఆయా అంశాలపై ఎస్పీలతో చర్చించామని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని ఎస్పీలకు.. హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్.. మద్యం షాపులపై కీలక నిర్ణయాలు

