9.95 లక్షల మంది ఏఎస్డీ జాబితాలో.. తొలగింపు దిశగా చర్యలు
ఇంకా 40 శాతానికి పైగా పెండింగ్లోనే డిజిటైజేషన్ ప్రక్రియ!
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ 40 శాతానికి పైగా ఇంకా పెండింగ్లోనే ఉంది.
ఇందులో దాదాపు 25 శాతానికి పైగా ఫారాలు తీసుకోని వారు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 47.36 లక్షల ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకు 27.26 లక్షల (57.56 శాతం) ఓటర్ల వివరాలు డిజిటైజ్ చేశారు. ఇతర ప్రాంతాలకు నివాసాలు మార్చడం, ఇళ్ల వద్ద అందుబాటులో లేకపోవడం, మరణించడం వంటి కారణాలతో ఏకంగా 9.95 లక్షల ఓటర్లను ఆబ్సెంట్ షిఫ్ట్ డెడ్ (ఏఎస్డీ) జాబితాలో చేర్చారు. గడువులోగా వివరాలు సమర్పించిన వారి పేర్లనే ముసాయిదాలో ఉంచి, మిగతా వారి పేర్లు తొలగిస్తామని ఎన్నికల విభాగం వర్గాలు పేర్కొన్నాయి. ఫోన్ చేసిన స్పందించని వారు, గ్రామాల్లో ఓటు ఉందంటున్న వారి సంఖ్య గణనీయంగానే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా బహదూర్పురాలో 63.35శాతం, కార్వాన్లో 62.01, సికింద్రాబాద్లో 60.41శాతం డిజిటైజేషన్ పూర్తయింది. అత్యల్పంగా సనత్నగర్లో 53.52, మలక్పేటలో 53.90, ముషీరాబాద్లో 54.01శాతం నమోదైంది. ఆన్లైన్ ద్వారా 4.91 లక్షల ఫారాలు రాగా.. అందులో 4.89 లక్షల దరఖాస్తులను బీఎల్వోలు పరిశీలించారని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు.

