హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో వల వేసి, మతం మార్చాలని ఒత్తిడి చేస్తూ అమ్మాయిలను వేధిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భాగ్యనగరంలోని పంజాగుట్ట పరిధిలో మరో వివాదాస్పద ఉదంతం బయటపడింది. హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని, ప్రేమ పేరుతో వారిని ట్రాప్ చేస్తున్న జమీర్, అతని తమ్ముడు మిరాజ్ వ్యవహారం ఇప్పుడు పోలీసుల వరకు చేరింది.
అన్నదమ్ముల 'ట్రాప్' ప్లాన్
నిందితులు జమీర్, అతని తమ్ముడు మిరాజ్ ఇద్దరూ కలిసి పక్కా ప్రణాళికతో యువతులను మోసం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఇప్పటివరకు సుమారు ఐదుగురు హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జమీర్పై గతంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఒక మైనర్ బాలికను వేధించిన కేసులో అతనిపై ఇప్పటికే పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదై ఉండటం గమనార్హం.
మిరాజ్ పాత్ర..
జమీర్ తమ్ముడు మిరాజ్ కూడా ఇదే తరహాలో యువతులను ట్రాప్ చేయడంలో అన్నకు సహకరిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
మతం మార్పుకోవాలని బ్లాక్ మెయిలింగ్..
జైలుకు వెళ్లి వచ్చినా జమీర్ ప్రవర్తనలో మార్పు రాలేదని, తాజాగా మరో యువతిని తన ప్రేమ వలలో వేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న నిందితుడు, ఆపై ఆమెను మతం మార్చుకోవాలని వేధించినట్లు సమాచారం. యువతిని భయపెట్టి అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు తెలుస్తోంది.
పోలీసుల యాక్షన్..
బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎంతమందిని మోసం చేశారు?, వీరి వెనుక ఏదైనా ముఠా ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల నుంచి ప్రాణహాని ఉందని భావిస్తున్న బాధితులకు పోలీసులు రక్షణ కల్పించే ఆలోచనలో ఉన్నారు.
యువతకు హెచ్చరిక..
సోషల్ మీడియా ద్వారా లేదా అపరిచితుల ద్వారా వచ్చే ప్రేమ ప్రతిపాదనలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. వ్యక్తిగత వివరాలను, ఫొటోలను పంచుకునే ముందు వారి నేపథ్యాన్ని సరిచూసుకోవాలని పోలీసులు కోరారు.

.
పొంగులేటి అవినీతి చిట్టా బయటపెట్టింది మేమే.. హరీశ్రావు ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ హయాంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారు: ఎంపీ రఘునందన్ రావు
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం..!
Read Latest Telangana News And AP News And International News And Telugu News

