Dailyhunt
హిందీలో మాట్లాడాలని ఒత్తిడి ఉండేది

హిందీలో మాట్లాడాలని ఒత్తిడి ఉండేది

చెన్నై, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): చెన్నై విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ కనిమొళికి ఎదురైన చేదుఅనుభవం అసాధారణమైన విషయం కాదని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. చెన్నై విమానాశ్రయంలో ఆదివారం ఒక సీఐఎ్‌సఎఫ్‌ అధికారి వద్ద కనిమొళి తనకు హిందీ తెలియకపోవడం వల్ల తమిళం లేదా ఆంగ్లంలో మాట్లాడమని కోరారు. అందుకా అధికారి హిందీ తెలియకపోవడం వలన 'మీరు భారతీయులేనా?' అని ఆమెను ప్రశ్నించారు. ఈ విషయాన్ని కనిమొళి తన ట్విట్టర్‌లో ప్రస్తావిస్తూ... హిందీ తెలిస్తేనే భారతీయులమనే భావన ఎప్పడు పుట్టుకొచ్చిందంటూ ట్వీట్‌ చేశారు. ఈ అంశంపై పి.చిదంబరం స్పందిస్తూ కనిమొళికి ఎదురైన చేదు అనుభవాలు తనకూ ఎదురయ్యాయని ప్రభుత్వ అధికారుల నుంచి సాధారణ పౌరుల వరకూ హిందీలో మాట్లాడమంటూ ఒత్తిడి చేసేవారని తెలిపారు.

ఇక కేంద్ర ప్రభుత్వోద్యోగులంతా త్వరగా హిందీ నేర్చుకుంటున్నప్పుడు, హిందీ తెలిసిన ఉద్యోగులు ఆంగ్లభాషను అంతే వేగంగా ఎందుకు నేర్చుకోలేరని చిదంబరం ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి హిందీ, ఆంగ్ల భాషలు అధికారిక భాషలనే భావన నిజంగా ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ హిందీతో పాటు ఆంగ్ల భాష కూడా ఖచ్చితంగా నేర్చుకునేలా ఒత్తిడి చేయాలని డిమాండ్‌ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy