అమరావతి, ఆగస్టు 26: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వెన్నుపోటు రాజకీయాలకు ప్రతిరూపమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
అలాంటి జగన్.. వెన్నుపోటుపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బుధవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఇతరులకు నీతులు చెప్పే ముందు రాజకీయ చరిత్ర చూసుకోవాలంటూ జగన్కు చురకలంటించారు. జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ వ్యవహారంలో వైఎస్ జగన్ వైఖరిపై మంత్రి మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్లపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ వైసీపీ అధినేతపై మంత్రి సత్యకుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. రిజర్వేషన్లు ప్రకటించడం కాదు.. చట్టబద్ధంగా నిలబెట్టడమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. జగన్ హయాంలో బీసీ రిజర్వేషన్లు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయని అన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలకు చట్టబద్ధమైన సామాజిక న్యాయం చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
బీసీలను ఓటు బ్యాంకుగా చూసింది జగన్ ప్రభుత్వమేనని మంత్రి సత్యకుమార్ యాదవ్ గుర్తు చేశారు. బీసీలను పాలనలో భాగస్వాములుగా చేస్తుంది కూటమి ప్రభుత్వమని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓటమిపై జగన్లో ఇప్పుడే ఆందోళన మొదలైందంటూ ఎద్దేవా చేశారు. ఓటమికి కారణాలు వెతికే పనిలో జగన్ ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.
కూటమి హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రజల మద్దతు కూటమి ప్రభుత్వానికే ఉందని జగన్ ఆందోళనతో మరోసారి తేలిపోయిందని మంత్రి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..

