Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జార్జియాలో తెలుగు భాష, వారసత్వ దినంగా ఉగాది.. ప్రకటించిన గవర్నర్!

జార్జియాలో తెలుగు భాష, వారసత్వ దినంగా ఉగాది.. ప్రకటించిన గవర్నర్!

అట్లాంటా(జార్జియా): అమెరికాలోని తెలుగు ప్రజలు మురిసిపోయే వార్త చెప్పారు జార్జియా రాష్ట్ర గవర్నర్ బ్రయన్.పీ. కెంప్. తెలుగువారు ఉత్సాహంగా జరుపుకునే ఉగాది పర్వదిన్నాని జార్జియాలో తెలుగు భాష, వారసత్వ దినంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు భాషకు ఎంతో చరిత్ర ఉందని, అత్యంత పురాతన భాషల్లో ఒకటైన తెలుగుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జార్జియా రాష్ట్రంలోని తెలుగు ప్రజలు ఉగాది సందర్భంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భావితరాలకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గొప్పదనాన్ని తెలియజెపుతున్నారని తెలిపారు. ప్రజల గవర్నర్‌గా పేరున్న బ్రయన్.పీ.కెంప్ అక్కడి తెలుగువారి అభీష్టం మేరకు ఉగాది పండుగ నిర్వహించే ఏప్రిల్ 12ను తెలుగు భాష, వారసత్వ దినంగా పేర్కొంటూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక గుర్తింపు కోసం జర్నలిస్టు రవి పోణoకి, జార్జియాలోని తెలుగు వారు చేసిన వినతిని ఆమోదిస్తూ గవర్నర్ బ్రయన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, 1980ల నుంచి ఉగాది పర్వదినాన జార్జియాలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని రవి పేర్కొన్నారు. అమెరికాలో ముఖ్యంగా జార్జియాలో తెలుగు వెలుగులు మరింతగా ప్రసరించేందుకు ఈ గుర్తింపు ద్వారా గట్టి పునాది పడిందని ఆయన వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy