ఇండియా టుడే, ఔట్లుక్-ఐకేర్ సర్వేల్లో అగ్రస్థానాలు
హైదరాబాద్: విద్య, పరిశోధన రంగాల్లో విశిష్ఠతను చాటుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది.
ఇండియా టుడే 'బెస్ట్ యూనివర్సిటీస్ సర్వే-2026'లో దేశంలోని అగ్రగామి జనరల్ (ప్రభుత్వ) విశ్వవిద్యాలయాల విభాగంలో ఓయూ 4వ ర్యాంక్ సాధించింది. బోధనా ప్రమాణాలు, పరిశోధన, మౌలిక వసతులు, అకడమిక్ నిర్వహణలో వర్సిటీ సాధించిన ప్రగతికి ఈ ర్యాంక్ నిదర్శనంగా నిలిచింది. అదేవిధంగా ఔట్లుక్ 'ఐకేర్ ర్యాంకింగ్స్-2026'లో టాప్-75 స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీల విభాగంలోనూ ఓయూ 13వ ర్యాంక్ సాధించింది.
పరిశ్రమల భాగస్వామ్యం, విద్యార్థుల అభ్యసన ఫలితాలు, వైవిధ్యత తదితర అంశాల్లో ఓయూ కనబరిచిన ప్రతిభకు ఈ గుర్తింపు లభించింది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఔట్లుక్-ఐకేర్ ర్యాంకింగ్స్-2026లో టాప్-25 ప్రభుత్వ ఇంజనీరింగ్ సంస్థల విభాగంలో 18వ ర్యాంక్ సాధించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్న ఏకైక విశ్వవిద్యాలయంగా ఓయూ నిలవడం విశేషం.
సమష్టి కృషి ఫలితమే : ఓయూ వీసీ
ఈ విజయాలు విశ్వవిద్యాలయ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది సమష్టి కృషికి నిదర్శనమని ఓయూ వీసీ కుమార్ అన్నారు. ర్యాంకింగ్స్ను విశ్వవిద్యాలయ కుటుంబానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఓయూను విద్యా దివ్యధామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

