విజయనగరం: యువతి కాళ్లు చేతులు కట్టి పడేసిన కేసు మిస్టరీ వీడింది. స్నేహితులతో బయటకు వెళ్లిన విషయం ఇంట్లో తెలుస్తుందని యువతి కట్టు కథ అల్లినట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు. కుటుంబ సభ్యులను నమ్మించేందుకు తానే కాళ్లు, చేతులు కట్టుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. యువతి అపస్మారకస్థితిలో పడి ఉన్నట్లుగా నటించిందని చెప్పారు.
కాగా డిగ్రీ చదువుతున్న ఓ యువతి విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ముళ్ల పొదల్లో నిస్సహాయ స్థితిలో పడి ఉండటం సోమవారం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు బాధితురాలిని చికిత్స కోసం తరలించారు. విజయనగరంలోని ఓ కళాశాలలో చదువుతున్న యువతి హాస్టల్ నుంచి తెర్లాం మండలంలోని స్వగ్రామానికి ఆదివారం మధ్యాహ్నం ప్రయాణమైంది.
అయితే ఇంటికి చేరని ఆమె.. సోమవారం ఉదయం గుర్ల పోలీస్ స్టేషన్కు సమీపంలోని పొదల్లో కాళ్లు, చేతులు కట్టేసి.. నోటిలో గుడ్డతో విలవిల్లాడుతూ స్థానికుల కంట పడింది. పోలీసులు ఆమెను పీహెచ్సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి.

