Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంది: దానం నాగేందర్

కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంది: దానం నాగేందర్

హైదరాబాద్, జులై 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉందని, అందుకే వారు బహిరంగ చర్చకు ముందుకు వచ్చారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) పేర్కొన్నారు. మంత్రులు పూర్తిగా, పారదర్శకంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈరోజు (గురువారం) హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడారు. తప్పు చేయలేదనే నమ్మకంతోనే ప్రజల ముందుకు వచ్చి మంత్రులు చర్చకు సిద్ధమయ్యారని చెప్పారు. అలాగే హరీశ్‌రావు అండ్ కో చర్చకు రావాలని కోరితే వారు తప్పించుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విమర్శలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గురుకులాలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు మంత్రులు ముందుకొచ్చారని దానం నాగేందర్ పేర్కొన్నారు.

కాగా, గురుకులాల నిర్వహణ, అవినీతి ఆరోపణల అంశంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహ్మద్ అజారుద్దీన్ బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పలు అంశాలపై చర్చించడానికి రెడీ అని చెప్పారు.

అయితే, ఈరోజు కాంగ్రెస్ మంత్రులు మొదటగా అసెంబ్లీకి బయలుదేరారు. అనంతరం గన్‌పార్క్‌కు చేరుకుని తమ సన్నద్ధతను ప్రకటించారు. గురుకులాల వ్యవహారంలో తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, అవినీతి ఆరోపణలపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని మంత్రులు స్పష్టం చేశారు. హరీశ్‌రావు అండ్ కో చర్చకు వస్తే సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బహిరంగంగా చర్చ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

గురుకులాల నిర్వహణ, నిధుల వినియోగం, అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో బహిరంగ చర్చకు కాంగ్రెస్ మంత్రులు సిద్ధమవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. హరీశ్‌రావు ఈ సవాల్‌కు ఎలా స్పందిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy