చిత్తూరు జిల్లా, సెప్టెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా మరింత ముందుకు సాగుతోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (AP Minister Anam Ramanarayana Reddy) వ్యాఖ్యానించారు.
కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్కు కొత్త ఊపిరి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు (సోమవారం) ఏపీ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తుల సంఖ్య గతం కంటే గణనీయంగా 35 నుంచి 40 శాతం పెరిగిందని వెల్లడించారు.
భక్తులకు మెరుగైన వసతులు..
భక్తులకు మెరుగైన వసతులు, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లను కల్పించడమే ఆలయాల్లో భక్తుల పెరుగుదలకు కారణమని మంత్రి ఆనం తెలిపారు. ఏపీలో పలు ఆలయాల అభివృద్ధికి దేవదాయ శాఖ ఆధ్వర్యంలో భారీగా నిధులు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో కొత్త ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. నిత్య నైవేద్యాలు, అన్నదాన కార్యక్రమాలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. తిరుమలతో పాటు కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
గోదావరి, కృష్ణా పుష్కరాలకు కూడా ముందస్తు ఏర్పాట్లు..
రానున్న గోదావరి, కృష్ణా పుష్కరాలకు కూడా ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ఆనం వెల్లడించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో మూడోసారి గోదావరి పుష్కరాలు జరగడం ఆయన చేసుకున్న అదృష్టమని అన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులతో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వినాయక స్వామిని కోరుకున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఆలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..

