అడ్డంకులు, అవాంతరాలపై ఏపీసీ సమీక్ష
హైదరాబాద్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ శాఖలో కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతుల దస్త్రానికి కాస్త మోక్షం కలిగింది. ''కదలని పదోన్నతుల దస్త్రం!'' శీర్షికతో ఈ నెల ఐదో తేదీన 'ఆంధ్రజ్యోతి' ప్రధాన సంచికలో కథనాన్ని ప్రచురించింది. వ్యవసాయ శాఖలో ఇంతవరకు సీనియారిటీ జాబితా తయారు చేయలేదని, కొత్త పోస్టుల మంజూరుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా ప్రతిపాదనలు పంపలేదనే అంశాలను, జాప్యానికి కారణాలపై కథనాన్ని ప్రచురించడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఏపీసీ జనార్దన్రెడ్డి శనివారం తెలంగాణ అగ్రి డాక్టర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సుదీర్ఘ స మీక్ష నిర్వహించారు.
1991 బ్యాచ్లో ఉద్యోగంలో చేరితే, 1995లో రెగ్యులరైజ్ చేశారని, 1992లో శాఖాపరమైన పరీక్షల పత్రాలు అడుగుతున్నారని, కొందరు అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన అంశంపై సమావేశంలో చర్చకు వచ్చింది. పైపెచ్చు 2018లో ఏపీసీగా సి.పార్థసారథి పని చేసిన సమయంలో 45 మందికి సీనియారిటీ పెంచుతూ వ్యక్తిగత జీవో జారీ చేసిన అంశంపైనా సమావేశంలో చర్చించారు. గవర్నర్ అనుమతి లేకుండా జీవోలు ఇవ్వడం సరైందికాదని, ఈ అంశంపై సీఎం కేసీఆర్ నుంచి స్పష్టత తీసుకున్న తర్వాతే ముందుకెళ్తానని ఏపీసీ జనార్దన్రెడ్డి రెండు ప్రధాన సంఘాల ప్రతినిధులకు స్పష్టం చేయడం గమనార్హం. 16-హెచ్ రూల్ అమలు చేస్తే ఎలా ఉంటుంది? అమలు చేయకపోతే పరిస్థితి ఏమిటనే అంశాలపై సీఎం అభిప్రాయం తీసుకుంటానని, తర్వాతే సీనియారిటీ జాబితాను తయారు చేస్తానని ఏపీసీ తెలిపారు.
