మరో 56 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి నిరంజన్రెడ్డి లేఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అదనంగా 56 వేల మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్కు శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్రంలో కందుల కొనుగోలు నిలిచిపోయి.. రైతులు ఇబ్బంది పడుతుండటంపై 'కంది రైతు కంట నీరు' శీర్షికన 'ఆంధ్రజ్యోతి' ఇటీవల కథనం ప్రచురించిన నేపథ్యంలో నిరంజన్రెడ్డి స్పందించారు.
రాష్ట్రంలో ఈ ఏడాది 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కంది దిగుబడి వచ్చిందని, గతంలో మంజూరు చేసిన 47 వేలతోపాటు తాజాగా ఇచ్చిన 4500 మెట్రిక్ టన్నుల కొనుగోలు ఏ మూలకూ సరిపోదని తోమర్కు రాసిన లేఖలో గుర్తు చేశారు.
మరో 56 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నివేదించారు. గతేడాది కన్నా 40.8 శాతం మేర వివిధ రకాల పంటల సాగు పెరిగిందని, 130 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు.

