న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాడేందుకు మాస్కులే బ్రహ్మాస్త్రమని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖలోని ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇవాళ ఆయన మాస్కులు పంపిణీ చేశారు. ఇతర రాజకీయ నేతలు, సంస్థలు, కంపెనీలు కూడా దీన్ని పాటించాలనీ... ప్రతి ఒక్కరినీ కాపాడుకునేలా కొవిడ్-19తో సరిగా ప్రవర్తించేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. అప్పుడే ప్రజల్లో ఒక రకమైన నిర్లక్ష్యం ధోరణి కనిపిస్తోందని ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 24 గంటలూ అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా కొవిడ్ కేసులను నిలువరించగలిగామని హర్షవర్థన్ పేర్కొన్నారు.
అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి
వ్యాక్సీన్లు అందుబాటులోకి రావడం, పరిస్థితులు మళ్లీ చక్కబడుతుండడంతో ప్రజల్లో క్రమంగా కరోనా నిబంధన పట్ల నిర్లక్ష్యం ఆవహిస్తోందన్నారు. ''వైరస్ మ్యూటేషన్ పొంది, సరిగ్గా విజృంభిస్తున్న సమయంలో మనం నిబంధనలు పక్కనబెట్టేశాం. దీనంతటి వల్లే కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది..'' అని మంత్రి పేర్కొన్నారు. సెకండ్ వేవ్ ఆంక్షలను ఇప్పుడిప్పుడే సడలిస్తున్నందున నిర్లక్ష్యం కూడదన్నారు. మాస్కులు ధరించకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా మళ్లీ కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

