Dailyhunt
కరోనా... మనలో రోగనిరోధక శక్తి పెరుగుతోంది..!

కరోనా... మనలో రోగనిరోధక శక్తి పెరుగుతోంది..!

స్టాక్‌హోం : దేశంలో రోజుకు సరాసరిన ఐదు వందల మందికి పైగా కరోనా బారిన పడినట్లు చెబుతున్న విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో... ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అదేమిటంటే... మన ఒంట్లో కరోనాను ఎదుర్కొనే శక్తి పురుడుపోసుకుంటోందట. స్వీడన్‌లోని ఓ యూనివర్శిటీ అధ్యయన ఫలితాలు ఈ విషయం చెబుతున్నాయి.

కొవిడ్‌ లక్షణాలు మధ్యస్థంగా ఉన్న వారిలో, అసలే లేని వారిలో చాలామంది కరోనాను ఎదుర్కొనే 'టి' కణ మాధ్యమ రోగనిరోధక శక్తి కలిగి ఉంటున్నట్టు కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌, కరోలిన్‌స్కా యూనివర్సిటీ హాస్పిటల్‌ పరిశోధకులు నిర్ధారించారు. ఈ విషయాన్ని... పరిశోధన ద్వారా నిరూపించారు కూడా.

మరో విశేషమేమిటంటే.. రక్తంలో యాంటీబాడీలు కనిపించకపోయినా కణ మాధ్యమ రోగనిరోధకశక్తి ఉంటోంది.

యాంటీబాడీ పరీక్షలు సూచిస్తున్నదాని కన్నా కరోనా రోగనిరోధక శక్తి మరింత ఎక్కువగా ఉంటోంది. వైరస్‌ సోకిన కణాలను పసిగట్టి, దాడికి పురికొల్పేవి తెల్లరక్త కణాల్లోని టి కణాలు. ఇవి గుర్తించగలిగిన స్థాయిలో యాంటీబాడీలు గలవారి సంఖ్యతో పోలిస్తే అంతకన్నా రెట్టింపు మందిలో టి-కణ రోగనిరోధకశక్తి అభివృద్ధి చెందినట్టు కనిపిస్తోందని చెబుతున్నారు.

వీరిలోనే కాదు... కరోనా లక్షణాలు లేని వీరి కుటుంబ సభ్యుల్లోనూ ఈ నిరోధక శక్తి బయటపడుతోందట. అంటే మనకు కరోనాను ఎదిరించే శక్తి ఆటోమేటిగ్గా వచ్చేస్తోందన్నమాట.. కరోనాతో వణికిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమాచారం ఊరట కలిగిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy