ఇంటర్నెట్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అగ్రనేత కరుణానిధిని తమిళనాడు అసెంబ్లీలో గౌరవపూర్వకంగా సంబోధించకపోవడం వివాదానికి దారితీసింది. అటవీ శాఖ మంత్రి రంజిత్ కుమార్, కరుణానిధి పేరును ఎలాంటి గౌరవపూర్వక బిరుదు లేకుండా ప్రస్తావించడంతో ప్రతిపక్ష డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వెంటనే జోక్యం చేసుకుని మంత్రి తరఫున క్షమాపణలు చెప్పారు (Tamil Nadu CM Vijay).
ఆరోగ్య, రెవెన్యూ శాఖల పద్దులపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బు పంపిణీ జరిగిన తీరును ప్రస్తావిస్తూ మంత్రి రంజిత్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంచీపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.1,500 వరకు పంపిణీ చేశారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఓట్ల కోసం డబ్బు పంపిణీ చేయకుండానే అధికారంలోకి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు (Karunanidhi R V Ranjith Kumar).
గత ఎన్నికల వ్యూహాలను వివరిస్తున్న సమయంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కేవలం 'కరుణానిధి' అని మాత్రమే సంబోధించారు. సాధారణంగా తమిళనాడు అసెంబ్లీలో కరుణానిధిని కలైంజర్ లేదా మాజీ ముఖ్యమంత్రి వంటి గౌరవపూర్వక పదాలతో ప్రస్తావిస్తుంటారు. మంత్రి వ్యాఖ్యలపై డీఎంకే సభ్యులు వెంటనే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేకేఎస్ఆర్ రామచంద్రన్ నేతృత్వంలో పలువురు డీఎంకే సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో అసెంబ్లీలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది (Tamil Nadu Assembly).
పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ముఖ్యమంత్రి విజయ్ వెంటనే జోక్యం చేసుకున్నారు. మంత్రి వ్యాఖ్యలు తగిన విధంగా లేవని అంగీకరించిన విజయ్, ఆయన తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని స్పష్టం చేశారు. దీంతో సభలో నెలకొన్న ఉద్రిక్తత కొంత సద్దుమణిగింది.
/span>
బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్.. పోలీస్ అధికారి, జర్నలిస్టు సహా నలుగురు అరెస్ట్..

