అమరావతి
కోరుట్ల ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి: బీజేపీ తెలంగాణ ఎన్నారై విభాగం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అయోధ్య రామ మందిరంపై వివాస్పద వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ తెలంగాణ ఎన్నారై సెల్ మిడిల్ ఈస్ట్ విభాగం నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం సమావేశమైన సందర్భంగా అధ్యక్షుడు నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ.. ఒక్కసారి అయోధ్య గురించి, రామాయణం గురించి తెలుసుకోవాలని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీయడం సరికాదని మండిపడ్డారు.
అంతేకాకుండా.. 'శ్రీరాముడు పుట్టిన పరమపవిత్ర స్థలమైన అయోధ్యలో.. మందిరం నిర్మించాలని హిందువులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. ఈ పోరాటంలో చాలా మంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. ఈ క్రమంలో ఇన్నాళ్లకు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. ఇది అత్యంత సంతోషించదగ్గ సమయం. గుడిని నిర్మించేందుకు ఎందరో ధనవంతులు ముందుకు వచ్చారు. కానీ.. రామ మందిరం నిర్మాణం అనేది ప్రతి ఒక్క హిందువు కల కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలనే సదుద్దేశంతో అమోధ్య తీర్థ ట్రస్టు నిధి సేకరణకు శ్రీకారం చుట్టింది. నిజానికి రామమందిర నిర్మాణంలో భాగస్వాములవడంపట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంతోషంగా ముందుకొచ్చి గుడి నిర్మాణం కోసం నిధిని సమర్పించుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో.. కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు.. రామమందిర నిర్మాణానికి విరాళం ఇవ్వకండని ప్రజలకు సూచించడం సరైన పద్ధతి కాదు' అని అన్నారు.
తెలంగాణలో ఎన్నో అయ్యప్ప దేవాలయాలు ఉండగా.. శబరిమలకు ఎందుకు వెళ్తున్నారని నరేంద్ర పన్నీరు.. విద్యాసాగర్ రావును ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో శివాలయాలు, వేంకటేశ్వర స్వామి ఆలయాలు ఉండగా.. సీఎం కేసీఆర్.. శ్రీకాళహస్తి, భద్రాచలం, తిరుపతికే ఎందుకు వెళ్తున్నారో సమాధానం చెప్పి తీరాలన్నారు. మీరు చేస్తే ఒప్పు.. తెలంగాణ హిందువులు చేస్తే తప్పా అని ప్రశ్నించారు. దీనిపై కల్వకుంట్ల విద్యాసగర్ రావు వివరణ ఇచ్చి.. హిందూ సమాజానికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుమార్ మంచికట్ల, కార్తిక్ వంకాయల, సంతోష్ బసవరాజుల, వేమాన్ కుమార్ కాశ, శ్యాం మామిడి, రమేష్ గరిగే, గురువయ్య చెనితోపాటు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.