జెనీవా, అక్టోబరు 18 : భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కొవాక్సిన్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు (ఈయూఎల్) లభించాలని చాలామంది కోరుకుంటున్న విషయం తమకు తెలుసని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొంది.
అయితే ఇందుకోసం దగ్గరి దారులను అనుసరించలేమని స్పష్టం చేసింది. ఏ టీకాకైనా.. నాణ్యత, భద్రత, ప్రభావశీలతలు మెరుగ్గా ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాతే అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేస్తామని ట్విటర్ వేదికగా వెల్లడించింది. కొవాక్సిన్కు అత్యవసర వినియోగ అనుమతుల మంజూరుపై సమీక్షించేందుకు డబ్ల్యూహెచ్వో సాంకేతిక సలహా బృందం ఈనెల 26న భేటీ అవుతుందని డబ్ల్యూహెచ్వో ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. కొవాక్సిన్ సమాచారాన్ని ప్రస్తుతం నిపుణుల బృందం విశ్లేషిస్తోందని, వారి నివేదిక ఆధారంగా టీకా అనుమతులపై వచ్చేవారం నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆమె చెప్పారు.
వేర్వేరు టీకాలతో బలమైన రక్షణ
మొదటి డోసు కొవిషీల్డ్ టీకా, రెండో డోసు ఏదైనా ఒక ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇన్ఫెక్షన్ ముప్పు తక్కువని స్వీడన్లో నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. రెండు డోసులూ కొవిషీల్డ్ తీసుకున్న వారితో పోలిస్తే .. ఈవిధంగా చెరో రకం టీకా డోసును వేయించుకున్న వారికి వైరస్ నుంచి బలమైన రక్షణ లభిస్తున్నట్లు గుర్తించారు.
