న్యూఢిల్లీ, జులై 27: కృష్ణా జలాల్లో వాటాకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కేసును పరిశీలించింది. సుదీర్ఘ విచారణ చేయాల్సి ఉన్నందున.. ఈ కేసును ప్రత్యేక బెంచ్ ముందు విచారణకు నివేదిస్తామని వెల్లడించింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేసింది.
ఈలోగా తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. కృష్ణా నదీ జలాల వాటాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ట్రిబ్యునల్ తీర్పును కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పైనే ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.

