విజయవాడ, మే 24 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నామని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ (AP Minister Anagani Satya Prasad) వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఎల్వోసీలను ఎప్పటికప్పుడు అందిస్తూ, పేద, మధ్యతరగతి ప్రజలకు కష్టకాలంలో అండగా నిలబడుతున్నామని పేర్కొన్నారు. సీఎం సహాయనిధి పేదల పాలిట సంజీవనిగా మారిందని తెలిపారు. జగన్ హయాంలో సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు చెల్లించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ధ్వజమెత్తారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలని సీఎం చంద్రబాబు మొదటి నుంచి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
పేదలకు ఆర్థికంగా చేయూతను ఇచ్చేలా సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా సీఎం సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో రూ.8 కోట్లు ఇప్పటి వరకు అందజేశామని తెలిపారు.
ఈ రోజు (ఆదివారం) విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 63 మంది లబ్దిదారులకు మంజూరైన రూ.87 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఎల్వోసీలను ఎమ్మెల్యేతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవ చేస్తున్నారని ప్రశంసించారు. రాత్రింబవళ్లు కష్టపడుతూ, ఎక్కడ ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా ఆయన సొంతంగా సాయం అందజేస్తున్నారని కొనియాడారు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పేదవాళ్లకు తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని మంత్రి అనగాని చెప్పుకొచ్చారు.

తాము ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసినప్పుడు కూడా తమ అందరికీ అన్నగా ఉండి, తమకొక దిక్సూచిగా గద్దె రామ్మోహన్ ఉన్నారని మంత్రి అనగాని ప్రస్తావించారు. విజయవాడలో 22,000 మందికి రాబోయే రోజుల్లో పట్టాలు రానున్నాయని తెలిపారు. గద్దె రామ్మోహన్తో పాటు, ఇతర ఎమ్మెల్యేలు విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇవన్నీ రాబోయే ఒకటి, రెండు నెలల్లో రూపకల్పన కాబోతున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
.
నా దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తా.. సీఎం చంద్రబాబు వార్నింగ్
నాలుగు దశల్లో స్వచ్ఛాంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్:మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And International News And Telugu News

