రాజస్థాన్ సర్కారు సంచలన నిర్ణయం
జైపూర్ (రాజస్థాన్): కరోనా రోగులను కుటుంబసభ్యులు కలిసేందుకు రాజస్థాన్ సర్కారు అనుమతినిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులను వారి కుటుంబసభ్యులు కలవవచ్చని రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ ప్రకటించారు. కరోనా రోగుల ఒంటరితనం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించేందుకు పీపీఈ కిట్, ఇతర రక్షణ పరికరాలు ధరించిన తర్వాత కరోనా రోగులను వారి కుటుంబసభ్యులు కలిసేందుకు అనుమతిస్తున్నట్లు రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
కుటుంబసభ్యులు పీపీఈ కిట్, మాస్కు, గ్లౌజులు వంటి రక్షణ చర్యలు తీసుకొని ఆసుపత్రి నిర్ణయించిన సందర్శన సమయంలో అవసరమైన భౌతిక దూరం పాటిస్తూ కరోనా రోగులను కలవవచ్చని ఆరోగ్యశాఖ ఆదేశించింది.

