Dailyhunt
లాక్‌డౌన్‌కు ముందున్న ధరల ప్రకారమే విక్రయించాలి

లాక్‌డౌన్‌కు ముందున్న ధరల ప్రకారమే విక్రయించాలి

హైదరాబాద్‌: తెలంగాణ లాక్‌డౌన్‌కు ముందున్న ధరల ప్రకామే నిత్యావసర వస్తువులను విక్రయించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి వ్యాపారులను ఆదేశించారు. పప్పు ధాన్యాలు, చక్కెర, వంట నూనెలు, ఎండు మిర్చి, పసుపు, చింత పండు, ఉప్పుతదివతర వస్తువుల నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, ఎప్పటి వరకూ సరిపోతాయి, ఎక్కడి నుంచి దిగుమతి అవుతున్నాయన్న అంశాలపై ఆయన హోల్‌సేల్‌ వ్యాపారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహా రాష్ట్ర, కర్నాటక నుంచి చక్కెర, గుజరాత్‌ నుంచి ఉప్పు, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ నుంచి శనగర పప్పు, మహారాష్ట్ర కర్నాటక నుంచి కందిపప్పు, రాజస్థాన్‌ నుంచి పెసరపప్పు, కృష్ణపట్నం, కాకినాడ, చైన్నై ఓడరేవుల నుంచి ముడి వంటనూనెలను నిరంతరం దిగుమతి చేసుకుంటున్నట్టు వ్యాపారులు తెలిపారు.

సరుకుల రవాణాలో సమస్యలు ఎదురవుతున్నాయని, వీటి పరిష్కరించాలని వ్యాపారలుఉ కమిషనర్‌కు విజ్ఞప్తిచేశారు.

ఎక్కడైనా చెక్‌పోస్టు వద్ద సరుకుల రవాణా వాహనాలను నిలిపి వేస్తే డ్రైవర్‌పేరు, వాహనం నెంబర్‌ తెలియజేస్తే వెంటనే సమస్యను పరిష్కరిస్తామని, రవాణాలో ఎలాంటి అవ రోధాలు ఎదురు కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హామీ ఇచ్చారు. రవాణా సమస్యలు ఎదురైతే హైదరాబాద్‌లోని సీఆర్‌వో కార్యాలయంలో 040-23447770కు ఫోన్‌ చేయాలని కమిషనర్‌ సూచించారు. మిర్యాలగూడ నుంచి 800 టన్నుల బియ్యం వస్తాయని, హమాలీల కొరతతో రవాణాను సూర్యాపేట వద్ద నిలిపి వేశారని వ్యాపారులు ఈ సందర్భంగా కమిషనర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు సరుకులు అమ్మవద్దని, కోవిడ్‌-19 ప్రబలుతున్న నేపధ్యంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వ్యాపార ధోరణితో కాకుండా మానవతా దృక్పధంతో,సామాజిక బాధ్యతగా పనిచేయాలని కమిషనర్‌ సూచించారు. ఈవిషయంలో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించాలని అన్నారు. అధిక ధరలపై విజిలెన్స్‌ బృందాలు ప్రత్యేకంగా నిఘా వేశాయని, అధిక ధరలకు విక్రయిసుంచినట్టు తేలితే పీడీయాక్ట్‌ నమోదు చేస్తామని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy