Dailyhunt
లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన వైసీపీ ఎంపీల బృందం

లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన వైసీపీ ఎంపీల బృందం

ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను వైసీపీ ఎంపీల బృందం కలిసింది. నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అనర్హత పిటిషన్‌ను స్పీకర్‌కు వైసీపీ ఎంపీలు అందజేశారు. లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన వారిలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, లావు కృష్ణదేవరాయ, మార్గాని భరత్, నందిగం సురేష్ ఉన్నారు.

రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌ ఓం బిర్లాను ఆ పార్టీ నాయకత్వం కోరినట్లు సమాచారం. శుక్రవారం ఎంపీలు, లాయర్లతో కూడిన బృందం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లారు. రఘురామరాజు బీజేపీకి చేరువవుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించకుండా..

లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయించి.. రాజకీయాల నుంచి దూరం చేయాలన్నది వైసీపీ వ్యూహంగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రఘురామకృష్ణరాజుకు విజయసాయిరెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లెటర్‌హెడ్‌పై షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. తమది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ అని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్న మాటే వాడకూడదని ఎన్నికల కమిషన్‌ చెప్పిందని.. వేరే పార్టీ ఇచ్చిన షోకాజ్‌కు తానెలా బదులిస్తానని పేర్కొంటూ రఘురామరాజు సీఎంకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు తనను దూషించడం, దిష్టిబొమ్మలను తగులబెట్టడం వంటి ఘటనల నేపథ్యంలో వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని.. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఓం బిర్లాను, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, కిషన్‌రెడ్డిలను కలిసి అభ్యర్థించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy