Dailyhunt
మహిళను వదలని కరోనా! 5 నెలల్లో 31 సార్లు పాజిటివ్!

మహిళను వదలని కరోనా! 5 నెలల్లో 31 సార్లు పాజిటివ్!

జైపూర్: కరోనా వైరస్ తీరుతెన్నుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..! ఓక్కో వ్యక్తిపై ఓక్కో రకమైన ప్రభావం చూపిస్తూ శాస్త్రవేత్తలకు, డాక్టర్లకు సవాలు విసురుతోంది. ఐదు నెలల కిత్రం కరోనా బారిన పడ్డ ఓ రాజస్థాన్ మహిళ ఇప్పటికీ పూర్తిగా కోలుకోకపోవడం ప్రస్తుతం అక్కడి వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎల్లోపతి వైద్యంతో పాటూ హోమియోపతి, ఆయుర్వేదం విధానాల ద్వారా ఆమెకు చికిత్సనందించినా కూడా కరోనా మహమ్మారి ఆమెను వదిలిపెట్టట్లేదు. ఇప్పటివరకూ ఆమె ఏకంగా 31 సార్లు కరోనా పాజిటివ్ అని తేలింది.

భరత్‌పూర్ జిల్లాకు చెందిన శారద అనే మహిళ గతేడాది ఆగస్టు నెలాఖరులో కరోనా బారినపడ్డారు.అప్పటి నుంచి కరోనా పరీక్ష జరిగిన ప్రతిసారీ ఆమెకు పాజిటివ్ అనే వచ్చింది.

తొలుత అమెను జిల్లాలోని ఆర్‌బీఎమ్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించినప్పటికీ..ఆ తరువాత స్థానికంగా ఉన్న అప్నా ఆశ్రమ్‌లోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. కరోనా తొలి నాళ్లలో ఆమె బలహీనంగా ఉన్నప్పటికీ ఆ తరువాత ఆమె క్రమంగా కోలుకుంది. అంతేకాకుండా .. 7 కిలోల బరువు కూడా పెరిగింది.

ప్రస్తుతం క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ఒకేఒక్క కరోనా రోగి శారద..! ఆమె ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ వరుసగా కరోనా పాజిటివ్ అని వస్తుండటంతో ఆందోళన చెందిన ఆశ్రమ నిర్వహకులు శారదను రాష్ట్ర రాజధాని జైపూర్‌లోని ప్రముఖ ఆస్పత్రి ఎస్ఎమ్ఎస్ హాస్పిటల్‌కు తరలించేందుకు నిర్ణయించారు. కాగా.. శారద లోని బలహీనమైన రోగ నిరోధక శక్తి కారణంగానే శరీరం నుంచి వైరస్ పూర్తిగా తొలగకపోయి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy