కర్నూలు(హాస్పిటల్), ఏప్రిల్ 22: జిల్లాలో ఏడు నెలల తర్వాత జిల్లాలో తొలి సారిగా వెయ్యి కరోనా కేసులు దాటేశాయి. గత 24 గంటల్లో 6,429 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,367 మందికి వైరస్ నిర్ధారణ అయింది. కొవిడ్ బారిన పడి ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తర్వాత కరోనా కేసుల విషయంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మార్చి 15 నుంచి మరింత ఉధృతి పెరిగింది. మార్చిలో సరాసరి 10 నుంచి 30 వరకు పెరిగిన కేసులు.. ఏప్రిల్లో 200 నుంచి 1000 దాకా పెరుగుతూ వచ్చాయి. ఇప్పటివరకు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 69,602కు చేరుకోగా మరణాల సంఖ్య 521కి చేరుకుంది.
నగరంలో 500 కేసులు
గడిచిన 24 గంటల్లో కర్నూలు నగరంలో దాదాపు 500 మందికి వైరస్ సోకింది. కర్నూలు రూరల్లో 23 కేసులు వెలుగు చూశాయి. వెలుగోడులో 3, వెల్దుర్తిలో 34, పగిడ్యాలలో 16, ఓర్వకల్లులో 8, నందికొట్కూరు మున్సిపాలిటీలో 20, క్రిష్ణగిరిలో 25, కోడుమూరులో 11, కల్లూరులో 20, జూపాడుబంగ్లాలో 6, గూడూరు మున్సిపాలిటీలో 15, డోన్ మున్సిపాలిటీలో 40, ఆత్మకూరు మున్సిపాలిటీలో 45, సి.బెళగల్లో 3, బేతంచెర్లలో 3 కేసులు నమోదయ్యాయి. నంద్యాల డివిజన్లో 259 కేసులు, ఆదోని డివిజన్లో 258 కేసులు వెలుగు చూశాయి.
జిల్లా కోర్టులో కరోనా
కర్నూలు(లీగల్), ఏప్రిల్ 22: స్థానిక జిల్లా కోర్టులో 30 మందికి వైరస్ సోకింది. సోమవారం కోర్టు ఆవరణలో కరోనా టెస్టులు నిర్వహించగా బుధవారం రాత్రికి రిపోర్టులు వచ్చాయి. ఇందులో 22 మంది న్యాయశాఖ సిబ్బందే ఉన్నట్లు తెలిసింది. దీంతో గురువారం న్యాయవాదులు, న్యాయమూర్తులు అతి ముఖ్యమైన కేసులను కేవలం ఆన్లైన్లో మాత్రమే నిర్వహించారు.
