బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా బెంగళూరు శివార్లలో జిలెటిన్ స్టిక్స్ కనిపించడం ఇటీవల సంచలనమైంది. ప్రధాని పర్యటనలో భద్రతా లోపానికి సంబంధించి తాజాగా ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే కారణంగా బెంగళూరు సౌత్ జిల్లా ఎస్పీ ఆర్.శ్రీనివాస గౌడ ఆదేశాలతో ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, ఒక అసిస్టెంట్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవం, ఆ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ 70వ పుట్టినరోజు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రయాణించిన మార్గానికి సమీపంలో పలు పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనమైంది. రెండు జిలెటిన్ స్టిక్స్లు, ఆరు ఇన్సెన్స్ స్టిక్లు, ఒక అగ్గిపెట్టె, సెల్ఫోన్ టేపులు, బ్యాటరీ ప్యాక్, వైర్లు, ఒక సర్క్యూట్ బోర్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాని పర్యటనకు సుమారు గంటన్నర ముందు ఈ పేలుడు పదార్థాలు కనిపించాయి. ఈ ఘటనపై పేలుడు పదార్థాల చట్టంలోని పలు సెక్షన్ల కింద బెంగళూరు సౌత్ జిల్లా కగ్గలిపుర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఇంతవరకూ పోలీసులు ఎలాంటి అరెస్టులు చేయలేదు. దర్యాప్తునకు సహకరించేందుకు ఢిల్లీ నుంచి ఎన్ఐఏ టీమ్ను కూడా రప్పించారు.

