Dailyhunt
మృతదేహానికి పోస్టుమార్టంనకు ఏర్పాట్లు... ఊహించని విధంగా...

మృతదేహానికి పోస్టుమార్టంనకు ఏర్పాట్లు... ఊహించని విధంగా...

న్యూఢిల్లీ: కర్నాటకలోని మహాలింగపూర్ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడిని మృతునిగా భావించి అటాప్సీ టేబుల్‌పై పడుకోబెట్టారు. ఆ శరీరాన్ని పరీక్షిస్తున్నంతలో దానిలో కదలిక మొదలవడంతో వైద్యులు హడలిపోయారు. వివరాల్లోకి వెళితే 27 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు అతనిని ముందుగా ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చారు.

అక్కడి వైద్యులు అతను చనిపోయాడని చెప్పి, అతనికున్న వెంటిలేటర్ కూడా తొలగించారు. దీంతో అతని బంధువులు బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పోస్టుమార్టం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపధ్యంలో అతని శరీరంలో కదలికలను ఒక పాథాలజిస్టు గుర్తించారు.

దీంతో అక్కడి వైద్యులు బాధితుడిని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతని ఆరోగ్యం మెరుగుపడింది. ఈ సందర్భంగా ఒక వైద్యాధికారి మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు తప్పుడు నిర్ణయం తీసుకుని, బాధితుని వెంటిలేటర్ కూడా తొలగించారన్నారు. అయితే బాధితుని కుటుంబ సభ్యులు ఈ ఉదంతంపై ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy