Dailyhunt
మూడో ఏడాదీ... రైతుబీమా కొనసాగింపు

మూడో ఏడాదీ... రైతుబీమా కొనసాగింపు

గురువారం అర్ధరాత్రికి పూర్తికానున్న స్కీమ్‌

వచ్చే ఆగస్టు 13 వరకు స్కీమ్‌ రెన్యువల్‌

33 లక్షల మంది రైతులకు 5 లక్షల బీమా

ఎల్‌ఐసీ కోసం 1,141 కోట్లు విడుదల

రెండేళ్లలో 32,267 కుటుంబాలకు

రూ.1613.35 కోట్ల సాయం

హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రైతుబీమా పథకాన్ని మూడో ఏడాది కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండేళ్లుగా అమల్లో ఉన్న ఈ పథకం కాలపరిమితి ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రితో ముగియనుంది. దీంతో.. ఆగస్టు 14 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 13 వరకు ఈ పథకాన్ని రెన్యూవల్‌ చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో..

వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 32.73 లక్షల మంది రైతులకు రూ.3,486చొప్పున రూ. 1141.44 కోట్లను బడ్జెట్‌ నుంచి విడుదల చేశారు. కరోనా కష్టకాలంలోనూ.. రైతుభీమా పథకం కొనసాగిస్తూ నిధులు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి నిరంజన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 2018 ఆగస్టు 14 తేదీ నుంచి రైతుబీమా(ఫార్మర్స్‌ గ్రూప్‌ ఇన్సూరెన్స్‌) పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. 18-59 సంవత్సరాల వయస్సు ఉన్న రైతులు ఏ కారణంతోనైనా మరణిస్తే.. వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ మేరకు ఎల్‌ఐసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. నిర్ణీత ప్రీమియం మొత్తాన్ని రైతుల తరుపున రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. రెండేళ్ల వ్యవధిలో 32,267 మంది రైతు కుటుంబాలకు రూ.1613.35 కోట్ల పరిహారాన్ని ఎల్‌ఐసీ అందించింది. మరో 1,800 మంది బీమా క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.

మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు: సింగిరెడ్డి

రాష్ట్రంలో రైతులు మోతాదుకు మించి ఎరువుల వాడకాన్ని తగ్గించాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లోని సెరికల్చర్‌ కార్యాలయంలో వానాకాలం ఎరువుల సరఫరాపై ఆయా కంపెనీలతో మంత్రి సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోతాదుకు మించిన ఎరువుల మూలంగా నేల స్వభావం దెబ్బతింటోందని, తెగుళ్లతో పాటు పురుగుల బెడద ఎదురవుతుందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy