Dailyhunt
మున్సిపాలిటీ స్థలం కబ్జా

మున్సిపాలిటీ స్థలం కబ్జా

వారం గడుస్తున్నా పట్టించుకోని అధికారులు

గతంలోనూ ఆక్రమణలు

మెదక్‌ మున్సిపాలిటీ, సెప్టెంబరు 16: మెదక్‌లో మున్సిపాలిటీకి చెందిన స్థలాలు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి.

ప్రధాన రహదారి పక్కనే ఉన్న విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. మున్సిపల్‌ పరిధిలో గతంలో ఐడీఎ్‌సఎంటీ స్పేస్‌-1 లేఅవుట్‌ను ఏర్పాటుచేసి స్థలాలను లబ్ధిదారులకు అందజేశారు. మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చేందుకు లేఅవుట్‌లో షాపింగ్‌కాంప్లెక్స్‌ నిర్మాణానికి కొంత స్థలాన్ని కేటాయించారు. సుమారు 30 దుకణాల నిర్మాణానికి సరిపోయే ఈ స్థలంపై కబ్జాదారుల కన్నుపడింది.

రూ.50 లక్షలు విలువైన 300 గజాల స్థలం చుట్టూ రాత్రికిరాత్రి ప్రహరీ నిర్మించారు. గతంలోనూ ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకొని బల్దియా అధికారులతో మున్సిపల్‌ స్థలంగా పేర్కొంటూ బోర్డును సైతం ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం మరోసారి అదే స్థలం కబ్జాకు గురైంది. ప్రహరీ నిర్మించి వారం రోజులైనా మున్సిపల్‌ అధికారులు ఇటువైపు రాలేదని, అధికారుల తీరు కారణంగానే విలువైన ప్రభుత్వం స్థలం కబ్జాకు గురవుతున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy