Dailyhunt
నా భర్తను చంపేయండి..

నా భర్తను చంపేయండి..

లేఖ రాసి గృహిణి ఆత్మహత్య

హైదరాబాద్/బంజారాహిల్స్‌: ''నా భర్త చిత్రహింసలు పెడుతున్నాడు. అతడు కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నా. అతడిని చంపేయండి'' అంటూ ఓ గృహిణి లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. యూసుఫ్‌గూడ సమీపంలోని ఎస్సీఆర్‌ హిల్స్‌కు చెందిన ఆంజనేయులు, నగరానికి చెందిన విజయ (31) పద్నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఆంజనేయులు రోజూ భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. దీనికి తోడు విజయను చంపేయాలని ఆంజనేయులు సోదరుడు చంద్రయ్య ప్రోత్సహించేవాడు. పలుమార్లు విజయ తల్లిదండ్రులు నచ్చచెప్పినా ఆంజనేయులు మారలేదు.

ఈ నెల 26న విజయ ఏడుస్తూ తల్లికి ఫోన్‌ చేసి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది.

మరికొద్ది సేపటికి ఫోన్‌ చేసి భర్త కొడుతున్నాడని ఏడుస్తూ తెలిపింది. అనంతరం విజయ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 'నా భర్త పెట్టే చిత్రహింసల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నా. భర్తను కూడా చంపేయాలి' అని లేఖ రాసింది. తన పిల్లల పోషణ బాధ్యత తల్లి, సోదరులు తీసుకోవాలని కోరింది. తన బావ చంద్రయ్య కూడా భర్తకు మద్దతు ఇచ్చేవాడని, తనను వదిలించుకుంటే ఇంకో వివాహం చేయాలనేది అతని పథకం అని పేర్కొంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy