న్యూఢిల్లీ: దేశంలోని రెండు రాష్ట్రాల్లో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కొత్తగా 9,855 కరోనా కేసులు నమోదు కాగా, కేరళలో ఇదే సమయంలో కొత్తగా 2,700 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 60 నుంచి 70 శాతం కరోనా కేసులు ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే లాక్డౌన్ విధించారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైని కరోనా మరోమారు వణికిస్తోంది. ఈ నేపధ్యంలో మహానగరంలో మాస్క్ పెట్టుకోని వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ముంబై పోలీసు కమిషనర్ పరమవీర్ సింగ్ హెచ్చరించారు. ప్రత్యేక జోన్లలో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయల వరకూ జరిమానా విధించనున్నట్లు తెలిపారు.
మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 3,60,500 మంది హోంక్వారంటైన్లో ఉంటూ కరోనాకు చికిత్స పొందుతున్నారు. కాగా బ్రెజిల్ నుంచి వచ్చే మహారాష్ట్రవాసులు తప్పనిసరిగా ఏడు రోజుల పాటు హోంక్వారంటైన్లో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

