హన్మకొండ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : నామినేషన్ల స్వీకరణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన దృష్ట్యా గురువారం బల్దియా కమిషనర్ పమేలా సత్పతితో కలిసి వరంగల్లోని ఎల్బీ కళాశాల, హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శక సూత్రాల ప్రకారం నామినేషన్ కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఎల్బీ కళాశాలలో 1 నుంచి 32 డివిజన్లకు, హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో 33 నుంచి 66 డివిజన్లకు నామినేషన్లను స్వీకరిస్తారని చెప్పారు.
ప్రతీ ఆర్వోకు ఒక గదితో పాటు ఒక వీడియోగ్రాఫర్తో మొత్తం నామినేషన్ల ప్రక్రియ రికార్డు చేస్తారని తెలిపారు. పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీసీపీ పుష్ప, ఏసీపీలు, బల్దియా అదనపు కమిషనర్ నాగేశ్వర్, అధికారులు పాల్గొన్నారు.
