
(భీమవరం)
మహాత్మాగాంధీ సతీమణి కస్తూరిబా పేరిట నడుస్తున్న కళాశాలను 'చరిత్ర'లో కలిపేశారు. ఆ కళాశాలకు వైసీపీ ఎమ్మెల్యే తండ్రి పేరు పెడుతూ జీవో జారీచేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని కస్తూరిబా కాలేజీకి ఎంతో పేరుంది. దీనిని చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ఏర్పాటు చేశారు. ఆయన తనకున్న దాదాపు 3 వేల ఎకరాలను విద్యాసంస్థల ఏర్పాటుకు దానం చేశారు.
ఏ ఒక్క సంస్థకూ తన పేరు పెట్టుకోలేదు. భీమవరంలో ఏర్పాటు చేసిన కాలేజీకి కస్తూరిబా పేరు పెట్టారు. ఈ కాలేజీకి దిరుసుమర్రు గ్రామానికి చెందిన దాత స్థలం విరాళంగా ఇచ్చారు. కళాశాలను 1977లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తమ స్థలం ఇచ్చేయాలని దాత వారసులు కోర్టును ఆశ్రయించగా ఐదేళ్ల కిందట వారికి అనుకూలంగా తీర్పువచ్చింది.
దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ బైపాస్ రోడ్వద్ద 30సెంట్ల స్థలాన్ని కళాశాల భవన నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఆయన విజ్ఞప్తి మేరకు కాలేజీ భవనానికి ఆయన తండ్రి గ్రంధి వెంకటేశ్వరరావు పేరు పెట్టారు. ఇప్పుడు మొత్తం కాలేజీ పేరునే మార్చేశారు. కస్తూరిబా పేరు తొలగించి గ్రంధి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలగా మారుస్తూ సెప్టెంబరు 8న జీవో జారీచేశారు. ఆ జీవోను రద్దు చేయాలంటూ ఏపీ గాంధీ స్మారక నిధి, జిల్లా సర్వోదయ మండలి ప్రతినిధులు సీఎం జగన్కు విజ్ఞాపనలు పంపారు. మంత్రి ఆదిమూలపు సురేశ్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదులు పంపించారు.