Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాలువల్లో మట్టిపోటు.. సాగునీరు నిలిచిపోవడంతో రైతుల్లో ఆందోళన

కాలువల్లో మట్టిపోటు.. సాగునీరు నిలిచిపోవడంతో రైతుల్లో ఆందోళన

  • వర్షాలకు కాలువల్లో పేరుకుపోయిన మట్టి

  • శివారుకు అందని వైనం

  • ఆందోళనలో ఖరీఫ్‌ రైతులు

గరుగుబిల్లి, జూలై5(ఆంధ్రజ్యోతి): జంఝావతి ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు సంబంధించి ఐదు మండలాలకు ఇటీవల సాగునీటిని విడుదల చేశారు.

అయితే పార్వతీపురం మండలం అడ్డాపుశీల, పిన్నింటిరామినాయుడువలస ప్రాంతాల్లోని కాలువల నుంచి దిగువకు నీరు వెళ్లడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలువల్లో మట్టి పేరుకుపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం పార్వతీ పురం- పాలకొండ రహ దారికి ఆనుకుని ఉన్న ప్రధాన కల్వర్టు ప్రాంతంలో నీరు నిలిచిపోతోంది. దీంతో గరుగుబిల్లి మండలానికి సాగు నీరు సరఫరా కాకపోవడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. వాస్తవంగా జంఝావతి ప్రాజెక్టు నుంచి కొమరాడ, గరుగుబిల్లి, సీతానగరం, పార్వతీపురం, మక్కువ మండలాల్లో సుమారు 24,640 ఎకరా లకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ఆధునికీకరణ పనులు పూర్తికాకపోవడంతో కొన్నాళ్లుగా ఐదు మండలాల్లో 9 వేల ఎకరాలకే నీరందిస్తున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పరిధిలోని పలు రకాల పనులకు రూ. 32 కోట్లు కేటాయించి కేవలం రూ.6 కోట్లుకే పరిమితమైంది. దీంతో పనులేవీ పూర్తి కాలేదు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా శివారు ప్రాంత భూములకు నీటి చుక్క అందడం లేదు. కాగా డిస్ట్రిబ్యూటర్లతో పాటు హైలెవెల్‌, లోలెవెల్‌ కాలువల అభివృద్ధి పనులకు ఇటీవల ప్రాజెక్టు అధికారులు సుమారు రూ.56 కోట్లతో అంచనాలు తయారు చేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే అనుమతులు మంజూరుకు కొంత సమ యం పట్టనుంది. రానున్న ఏడాదికే నిధులు మం జూరు చేస్తే ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు సాగునీటి ఇక్కట్లు తప్పవు. ఇప్పటికే వారు సొంత నిధులతో ప్రధాన కాలువ పరిధి లోని మరమ్మతులు చేపట్టారు. అడ్డాపుశీల ప్రాంతంలో గండ్లు పడకుండా, పూడికలు తొలగింపు వంటి పనులను యంత్రాలతో నిర్వహించారు. తులసిరామినాయుడువలసలో కాలువకు పడిన గండిని పూడ్చారు. ఈ నేపథ్యంలో తమ కష్టాలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.

సాగునీటి సరఫరాకు చర్యలు

అడ్డాపుశీల, పిన్నింటిరామినాయుడువలస ప్రాంతాల్లోని కాలువల నుంచి సాగునీరు సరఫరాకు ఆటంకం నెలకొంది. వర్షాల కారణంగా కాలువల్లో అధికంగా మట్టి నిల్వలు చేరాయి. దీంతో దిగువకు నీరు వెళ్లడం లేదు. మట్టిని తొలగిం చేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత ఖరీఫ్‌లో ఆధునికీకరణ పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఆర్థికశాఖ నుంచి నిధుల మంజూరకు గ్రీన్‌సిగ్నల్‌ రావాల్సి ఉంది.

-పి.పవన్‌కుమార్‌, ఏఈ, జంఝావతి ప్రాజెక్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy