హైదరాబాద్, మే3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై(ORR) ప్రయాణించే వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) ఒక ముఖ్య గమనిక చేశారు.
ఇటీవల కాలంలో ఆగి ఉన్న వాహనాలను వెనుక నుంచి వేగంగా వచ్చే వాహనాలు ఢీకొట్టడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి పలు సూచనలు చేశారు. ఈ మేరకు సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అనవసరంగా వాహనాలు ఆపొద్దు..
వాహనాల బ్రేక్ డౌన్, మెడికల్ ఎమర్జెన్సీ వంటి బలమైన కారణాలు ఉంటే తప్ప, సెల్ఫీలు దిగడానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి వాహనాలను రోడ్డు పక్కన నిలపడం చట్టరీత్యా నేరమని.. అత్యంత ప్రమాదకరమని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఒకవేళ మీ వాహనం ఆగిపోతే, తక్షణమే 14449 నంబర్కు కాల్ చేయాలని సూచించారు. వీరు మీకు తగిన సహాయం అందించడమే కాకుండా, ఇతర వాహనదారులను అప్రమత్తం చేసే ఏర్పాట్లు చేస్తారని తెలిపారు.
ఎడమ వైపు మాత్రమే నిలపాలి..
అత్యవసర పరిస్థితిలో వాహనాన్ని నిలపాల్సి వస్తే, వేగంగా వచ్చే ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా ఎడమ వైపు ఉన్న లైన్లో మాత్రమే నిలపాలని సీపీ సజ్జనార్ సూచించారు. వాహనం ఆపినప్పుడు, వెనుక నుంచి వచ్చే వారికి కనీసం 50 నుంచి 100 మీటర్ల దూరం నుంచే తెలిసేలా 'రిఫ్లెక్టివ్ ట్రయాంగిల్స్' లేదా ఇతర హెచ్చరిక గుర్తులను ఏర్పాటు చేయాలని తెలిపారు. వాహనం ఆపి ఉన్నంత సేపు హజార్డ్ లైట్లను (నాలుగు ఇండికేటర్లు) ఆన్ చేసి ఉంచడం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని అన్నారు. ORRపై వాహనాల వేగ పరిమితి గంటకు 120 కిలోమీటర్ల వరకు పెంచిన నేపథ్యంలో, ఒక్క చిన్న పొరపాటు కూడా భారీ ప్రాణ నష్టానికి దారితీసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నిబంధనలను పాటించి మీ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను కాపాడాలని సీపీ సజ్జనార్ సూచించారు.
.
రుణమాఫీ చారాణ చేసి.. బారాణ ఎగ్గొట్టింది.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు సెటైర్లు
తండ్రిని విమర్శించడం కవితకు తగదు: దానం నాగేందర్
Read Latest Telangana News And AP News And International News And Telugu News

