మొయినాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా, కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ జంట ఒకటైంది. ఈ వేడుకకు నగర శివారు మొయినాబాద్ వేదికైంది. తమిళ ప్రముఖ హీరో విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తాము త్వరలోనే ప్రేమవివాహాం చేసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. రీసెంట్గానే ఏప్రిల్ 22న మా పెళ్లి అంటూ.. వారు శుభలేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి సమీపంలోని ఓ విల్లాలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో వారు తమ వివాహాన్ని కుటుంబ సభ్యులు, కొంతమంది ప్రముఖుల సమక్షంలో జరుపుకున్నారు.
ఈ వివాహ వేడుకల్లో రాష్ట్ర క్రీడా, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

