
ప్రకాశం: ఒంగోలులోని క్వారంటైన్ సెంటర్లో కరోనా అనుమానితులు ఆందోళనకు దిగారు. బయటకు వెళ్లేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డగించారు. దీంతో వారు ఆగ్రహించారు. ఉదయం 11 గంటల వరకూ కనీసం టిఫిన్ కూడా పెట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలలో పశువులకు వేసే ఆహారం తమకు పెడుతున్నారని ఆరోపించారు. వారం పది రోజులు అయినా తమ రిపోర్టులు ఇవ్వడం లేదని, కొందరికి పరీక్షలు కూడా చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నెగెటీవ్ రిపోర్టులు వచ్చిన వారిని క్వారంటైన్ నుంచి ఎందుకు పంపించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు క్వారంటైన్లో ఉన్న వారిలో ఎవరికి నెగిటీవ్, ఎవరికి పాజిటివ్ అనే కనీస సమాచారం అధికారుల ఉందా అని ఫైర్ అవుతున్నారు.
వరద బాదితుల మాదిరిగా అందరినీ ఒకే చోట క్వారంటైన్ సెంటర్లలో కుక్కి వెళ్లిపోతున్నారని అధికారుల తీరుపై బాధితులు ధ్వజమెత్తారు. కనీసం మాస్క్లు, శానిటైజర్లు కూడా ఇవ్వకుండా తాళాలు వేసి వెళుతున్నారని ఆరోపించారు. క్వారంటైన్లో ఇచ్చే ఆహారం తింటే వాంతులు, జ్వరం వస్తోందని, తమను పట్టించుకునే నాధుడే లేడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.