అమరావతి, జూన్ 30: స్పేస్, డ్రోన్ సిటీల నుంచి గ్రీన్ హైడ్రోజన్ వరకూ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఊహించని ప్రగతిని సాధించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
గత ఐదేళ్ల పాలనతో పోలిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019 నుంచి 2024 వరకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల సంఖ్య పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక విధానాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల గడిచిన రెండేళ్లలోనే ఏకంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే 24.3 శాతం వాటాను దక్కించుకొని దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని మంత్రి గర్వంగా ప్రకటించారు.
రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలను వేగంగా కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని మంత్రి టీజీ భరత్ వివరించారు. ఇందులో భాగంగా నిర్వహించిన 18 ఎస్ఐపీబీ (SIPB) సమావేశాల్లోనే దాదాపు రూ.11.77 లక్షల కోట్ల పెట్టుబడులకు లైన్ క్లియర్ చేస్తూ అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర యువతకు పది లక్షల ముప్పై రెండు వేల (10.32 లక్షలు) కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటివరకు వివిధ శాఖల ద్వారా 26 నూతన విధానాలను (పాలసీలను) ప్రకటించగా, అందులో పరిశ్రమల శాఖే స్వయంగా 6 కీలక పాలసీలను తీసుకొచ్చిందని గుర్తుచేశారు. క్వాంటం వ్యాలీ, ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్, స్పేస్, డ్రోన్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీతో పాటు సర్కులర్ ఎకానమీ పాలసీలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందన్నారు.
.

