అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి లేకుంటే సంపద లేదని.. సంపద లేకుంటే సంక్షేమం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. మనం అందించే సేవలపై ప్రజలు సంతృప్తి చెందాలని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఈరోజు (గురువారం) సచివాలయంలో జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. అధికారులు సమష్టిగా పనిచేసి.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ప్రజాసమస్యలను వందశాతం పరిష్కరించాలని మార్గనిర్దేశం చేశారు. ఏపీని పునఃనిర్మిస్తామని తాను, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చామని ప్రస్తావించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ అనేది చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. అందరి సహకారంతో రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందని.. ఇది సమష్టి విజయమని ఉద్ఘాటించారు. ఈ అవార్డు తనకు బాధ్యతతో కూడినది అని.. నిజానికి ఇలాంటి అవార్డులు పాజిటివ్ మూడ్ క్రియేట్ చేస్తాయని వ్యాఖ్యానించారు.

