Dailyhunt

పీఆర్సీపై సీఎం వద్దే తేల్చుకుంటాం: రాజేందర్

హైదరాబాద్: పీఆర్సీపై ముఖ్యమంత్రి వద్దే తేల్చుకుంటామని సీఎస్‌కు తెలిపినట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ రాజేందర్ తెలిపారు. పీఆర్సీపై సీఎస్‌తో టీజీవో, టీఎన్జీవో సంఘాల సమావేశం ముగిసింది. అనంతరం రాజేందర్ మాట్లాడారు. '43 శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్ ఇవ్వాలని సీఎస్‌ను కోరాం. పీఆర్సీపై రాజకీయ నిర్ణయం మాత్రమే జరగాలి. పీఆర్సీ నివేదికను చెత్త బుట్టలో వేస్తున్నాం. ఎవరో కాదు.. ముఖ్యమంత్రి మాత్రమే పీఆర్సీపై నిర్ణయం తీసుకోవాలి. 7.5శాతం పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు' అని చెప్పారు.

'మంత్రులు, ముఖ్యమంత్రిని కలసి ఆమోదయోగ్యమైన పీఆర్సీని సాధిస్తాం. ఆర్థిక మాంద్యం మెరుగు పడిన తర్వాత కూడా ఉద్యోగులను చిన్న చూపు చూడటం అన్యాయం.

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులకు అన్యాయం జరిగింది. వయోపరిమితి ఈనెల నుంచే అమలు చేయాలి. గ్రాట్యుటీని 20 లక్షలకు పెంచాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రభుత్వంతో ఒకే రకంగా వ్యవహరిస్తాం. సీఎం దగ్గర మాకు తలుపులు మూసుకుపోలేదు. తెగేదాక లాగం. లౌక్యం పనిచేయనప్పుడు ఏమి చేయాలో నిర్ణయిస్తాం' అని రాజేందర్ వ్యాఖ్యానించారు.

టీజీవో అధ్యక్షురాలు మమత..

'పీఆర్సీ సాధన కోసం త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తామని టీజీవో అధ్యక్షురాలు మమత తెలిపారు. 'నివేదికపై సీఎస్ ముందు మా ఆవేదనను తెలిపాం. పీఆర్సీ నివేదిక కాదు.. అది పిసినారి నివేదిక. ముఖ్యమంత్రి ఉద్యోగుల పక్షాన ఉంటారన్న నమ్మకం ఉంది. ఉద్యోగుల్లో అపోహలు వద్దు.. మంచి పీఆర్సీ సాధిస్తాం. పీఆర్సీ నివేదిక అశాస్త్రీయంగా తయారు చేశారు. నలుగుర్ని కాకుండా.. కుటుంబంలో ముగ్గుర్ని మాత్రమే తీసుకుని నివేదినకు తయారు చేశారు' అని మమత ఆరోపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy